హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా పని చేయాలని, అదే కీలక బాధ్యత కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి, ‘సెర్ప్’ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. వ్యాపార రంగంలో మహిళలు మరింత రాణించేందుకు ‘సెర్ప్’ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. నిరుడు స్వయం సహాయక సంఘాల ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎండుమిర్చి కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ మారెటింగ్ కోసం ప్లాంట్ లుపిడ్స్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఆశించిన దానికంటే అదనపు ఫలితాలు సాధించింది.
ఈ సీజన్లో కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, వరంగల్, జన గామ, సూర్యాపేట జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆరు జిల్లాల డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలు, డీపీఎంలు, ఏపీఎంలకు ఓరియెంటేషన్ వర్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడారు. గత సీజన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల డీఆర్డీవోలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పటికే ఫ్లిప్కార్ట్, ప్లాంట్ లుపిడ్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని ముందుకెళ్తున్నామని, మరిన్ని కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. జనవరి మూడో వారం నుంచి ఎండుమిర్చి సేకరణ జరిగే అవకాశాలున్నందున ఈ నెల 12లోగా క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి, ఎండుమిర్చి సేకరణకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ‘సెర్ప్’ చీఫ్ ఆపరేషన్స్ అధికారి రజిత, తదితరులు పాల్గొన్నారు.