మామిళ్లగూడెం, మే 19: ఆ జాగిలం 2010లో ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో అడుగుపెట్టింది. పలు కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొని వివిధ రకాల మందు పాతరలను, పేలుడు పదార్థాలను పసిగట్టింది. భారీ విధ్వంసాలను అరికట్టి ఔరా అనిపించుకున్నది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నిలువరించింది. తనదైన ప్రతిభను కనబర్చుతూ ఉన్నతాధికారుల మనసు గెలిచి బంగారు పతకాలను సాధించింది. ఇలా నేర నిర్ధారణ విభాగంలో 13 ఏండ్ల పాటు విశేష సేవలందించి.. వయోభారంతో శుక్రవారం కన్నుమూసింది.
ఆ జాగిలమే ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న (ఎక్స్ప్లోజివ్ డాగ్) పూనం. ఈ జాగిలానికి ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీతో పాటు ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, తిరుపతి, శ్రీశైలం, సిబ్బంది నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పూనం 2010లో పోలీస్ ఫోర్స్లోకి వచ్చి శిక్షణ సమయంలోనే గోల్డ్ మెడల్ సాధించిందని పేర్కొన్నారు. 2011లో చర్ల కూంబింగ్ ఆపరేషన్లో నాలుగు మందు పాతరలను గుర్తించిన ఈ జాగిలం.. 2014లో భద్రాచలం పట్టణంలోని బస్టాండులో పేలుడు పదార్థాలను కనిపెట్టిందని చెప్పారు. పోలీస్ ఆర్సీ కోర్సులో పూనం నాలుగు బంగారు పతకాలు సాధించిందని సీపీ వివరించారు.