హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2026 షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026-27 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదేరోజు నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించవచ్చని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, మహిళా వర్సిటీ, ఎర్త్సైన్స్ వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు.
ఈ ఏడాది మొత్తం 40 సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించనున్నామని, అయితే బయోటెక్నాల జీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ సబ్జెక్టులకు ఒకే పరీక్షను ఉంటుందని తెలిపారు. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను సీపీగెట్ నుంచి ఉపసంహరించి, దోస్త్లో చేర్చిన ట్టు పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో పరీక్షలను నిర్వహించి, ఆగస్టులో పీజీ ఫస్టియర్ క్లాసులను ప్రారంభిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు.
2025-26లో 45.3శాతం సీట్లు మాత్రమే నిండినట్టు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ తెలిపారు. 62,821మంది సీపీగెట్కు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, 51,587మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 264 పీజీ కాలేజీలుండ గా 43,344 సీట్లకు 19,641 సీట్లు (45.3 శాతం) సీట్లు భర్తీ అయినట్టు వివరించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, పలు వర్సిటీల వీసీలు ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి, ప్రొఫెసర్ సూర్యా ధనుంజయ్, ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ ఉమేశ్, కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం పాల్గొన్నారు.
