TS TET | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేద్దామని ప్రయత్నిస్తే ఫీజు తీసుకోదు.. కొంత మందికి ఆన్లైన్లో ఫీజు చెల్లించినా జర్నల్ నంబర్ జనరేట్ కాదు.. మరికొంత మంది డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయినా ‘పేమెంట్ నాట్ డన్’ అని వస్తుంది.. ఇంకొన్నిసార్లు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే ‘ఎర్రర్ గేట్ వే’ అని వస్తున్నది.. ఎస్బీఐ ఖాతాదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే తీసుకోవడమే లేదు.. ఇవీ టెట్లో రెండు మూడు రోజులుగా అభ్యర్థులకు ఎదురవుతున్న తిప్పలు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థుల కోసం నిర్వహించనున్న టెట్ దరఖాస్తుల ప్రక్రియ పెద్ద ప్రహసనాన్ని తలపిస్తున్నది. సాంకేతిక సమస్యలు నిత్యకృత్యం కావడంతో దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అభ్యర్థులంతా టెట్ హెల్ప్లైన్ నంబర్లను ఆశ్రయిస్తున్నారు. పేమెంట్ గేట్వే తమకు చెందినది కాకపోవడంతో హెల్ప్లైన్ సిబ్బంది ఏమీ చేయలేమంటూ సమాధానాలు ఇస్తున్నారు. కస్టమర్ కేర్ నంబర్లల్లో మూడు పనిచేయడమే లేదు. ఒక నంబర్ ఎప్పుడూ బిజీ వస్తున్నది. ఆయా నంబర్ ఎత్తిన వ్యక్తి సగం సగం సమాధానాలు ఇస్తూ మధ్యలోనే ఫోన్ కట్ చేస్తున్నారు.
వెన్నాడుతున్న సెంటర్ సమస్య
టెట్ వెబ్సైట్లో తరుచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో అభ్యర్థులు సతమతం అవుతున్నారు. ఓ అభ్యర్థి వారం రోజులుగా టెట్కు ప్రయత్నిస్తున్నా దరఖాస్తు పూర్తికావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు. దరఖాస్తులు ఎక్కువ వచ్చినప్పుడల్లా జిల్లా కేంద్రాల సెంటర్లను బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేస్తే పరీక్ష కేంద్రాలు దూరంగా పడతాయేమోనన్న ఆందోళనతో అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, ఫీజు చెల్లింపు సమస్యలు వారిని వెంటాడున్నాయి.
అభ్యర్థుల్లో కలవరం
టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి 27న ప్రారంభం కాగా, ఈ నెల 10తో గడువు ముగియనున్నది. గతంలో దరఖాస్తు గడువును పొడిగించలేదు. ఈసారీ పొడగించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతోపాటు దరఖాస్తు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.