వెల్దండ, డిసెంబర్ 18: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు నిర్బంధించారు. లింగాల మండలం అంబట్పల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు గువ్వల, ఆయన సతీమణి అమల హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టగా, విష యం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గువ్వలను అడ్డుకోవాలని హాజీపూర్ చౌరస్తాలో సమావేశమయ్యారు.
అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతల సమస్య రాకుండా ముందస్తుగా వెల్దండ వద్ద గువ్వ ల వాహనాలను అడ్డుకొని, గువ్వల దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఠాణాలో రెండు గంటలపాటు వారితోపాటు నాయకులను నిర్బంధించా రు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గువ్వల అభిమానులు వందలాదిగా ఠాణాకు తరలివచ్చారు.
పీఎస్ ఎదుట బైఠాయించి తమ నేతను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గువ్వలను హైదరాబాద్కు తరలించేందుకు బయటకు తీసుకురాగా, గులాబీశ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్త ల మధ్య తోపులాట జరిగింది. కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి గువ్వల దంపతులను హైదరాబాద్లోని వారి స్వగృహానికి తరలించారు.
కాంగ్రెస్ది అధికార దుర్వినియోగం : గువ్వల
కాంగ్రెస్ అధికారం చేపట్టి 10రోజులు కాకముందే అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గువ్వల బాలరాజు ఆరోపించారు. వెల్దండ ఠాణాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. దైవకార్యానికి వెళ్లే తమను పోలీసులతో అడ్డగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలను అదుపులో పెట్టుకోలేని సీఎం, ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తారని నిలదీశారు. ఇంత అరాచకం సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తే సహించేంది లేదని తేల్చి చెప్పారు.