TS Weather | హైదరాబాద్ : చలికాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గి ఫిబ్రవరి రెండో వారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉందని, ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగర్నత తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు చలి గాలులు వీస్తాయని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో ఉదయం వేడిగాలులు వీస్తాయని, సాయంత్రం చలి గాలులు వీస్తాయని తెలిపారు. ఫిబ్రవరి మూడో వారంలో మళ్లీ చలి పెరిగి, నాలుగో వారంలో ఎండల తీవ్రత మొదలవుతుందని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఏప్రిల్ వరకు కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే మార్చిలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు డైరెక్టర్ నాగరత్న వివరించారు.