హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఉత్తర, ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోగా.. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు డిగ్రీలకు పడిపోయాయి. గతేడాది కంటే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని టీఎస్ డీపీఎస్ పేర్కొంది. గత ఏడాది ఇదే సిర్పూర్ (యు)లో 6.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఈ ఏడాది 6 డిగ్రీలకు తగ్గింది.
అలాగే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో గత ఏడాది 6.8 కాగా ఈ ఏడాది 6.2, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గత ఏడాది 9.7 కాగా ఈ ఏడాది 8.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్లో 6 డిగ్రీల సెల్సియస్ నుంచి వనపర్తి 13.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని టీఎస్డీపీఎస్ తెలిపింది. కాగా, సోమవారం రాత్రి ఉష్ణోగ్రతలు 22 జిల్లాల్లో 5నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
ఇందులో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో సాధారణకంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్, అల్వాల్, ముషీరాబాద్ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.
రాష్ట్రంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి వీచే చలిగాలులు గంటకు ఆరు నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాత్రి నుంచే పొగమంచు కురుస్తున్నది. ఉదయం సమయంలో రోడ్లపై పొగమంచుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉత్తర తెలంగాణలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చీకటి పడే సమయానికి గ్రామీణ ప్రజలు తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు.