తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన పలువురు ప్రముఖులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలతో ఘనంగా సత్కరించింది. వర్సిటీ వీసీ టీ కిషన్రావు అధ్యక్షతన శనివారం జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ పురస్కారాలను ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), డీ అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్ గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్కే వెంకటార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజంగౌడ్ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్ ములుగ అంజయ్య (అవధానం), పీ చంద్రశేఖర ఆజాద్ (నవల), ఎన్ అరుణ (ఉత్తమ రచయిత్రి)కు ప్రదానం చేశారు. అరుణ తరఫున ఆమె కోడలు డాక్టర్ సంధ్య పురస్కారాన్ని అందుకొన్నారు. పురస్కార గ్రహీతలకు రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందించి శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్, వర్సిటీ విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ జానపద కళల విభాగం విద్యార్థులు జడకోలాటం నృత్య ప్రదర్శనతో ఆహూతులను అలరించారు.