హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ కార్యాచరణ అద్భుతంగా ఉన్నదని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ప్రశంసించారు. శనివారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ‘సెమినార్ ఆన్ అవేర్నెస్ ఆన్ యాంటి ర్యాగింగ్’ అంశంపై అన్ని రాష్ర్టాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు, కార్యదర్శులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మానవ అక్రమ రవాణా సమాజానికి తీరని కళంకమని, దీన్ని అరికట్టేందుకు తెలంగాణ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
మానవ అక్రమ రవాణా నుంచి బయటపడ్డ వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపటంలోనూ తెలంగాణ ముందున్నదని కొనియాడారు. సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించటం, పేదరికం, కుటుంబ అవసరాలను తీరుస్తామని ఆకర్షించడం, నిరుద్యోగం, భర్త నుంచి విడిపోయిన మహిళలను లొంగదీసుకోవటం, సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తామని ఎరవేయడం వంటివి మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలు అని చెప్పారు. అక్రమ రవాణాకు గురైన వారిని ఎకువగా సెక్స్ వరర్లుగా, కూలీలుగా, బాల కార్మికులుగా, బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని వెల్లడించారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు పౌరసమాజం, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. యువత బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు.