హైదరాబాద్/రంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఔషధాలు, వ్యాక్సిన్లను మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరవేసే ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వికారాబాద్లో శనివారం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మున్సిపల, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే నెల మూడో వారం వరకు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగనుంది. ప్రస్తుతం ‘కనిపించేంత దూరం’లోని (విజువల్ లైన్ ఆఫ్ సైట్ -వీఎల్వోఎస్) లక్ష్యాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేస్తున్నారు. అనంతరం ఎంపిక చేసిన మార్గాల్లో 9-10 కిలోమీటర్లలోని లక్ష్యాలకు (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్-బీవీఎల్వోఎస్) ఔషధాలను రవాణా చేయనున్నారు. తద్వారా దేశంలోనే మొదటిసారిగా బీవీఎల్వోఎస్ పద్ధతిలో సరుకులను రవాణా చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనున్నది. జిల్లా కేంద్రాల్లోని ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమూల ప్రాంతంలోని గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కేవలం గంటలో వ్యాక్సిన్లు, మందులు తదితర అత్యవసరాలను డ్రోన్ల సహాయంతో సరఫరా చేయనున్నారు. ఈ డ్రోన్లు భూమికి 500 నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఐటీఈసీ శాఖకు చెందిన ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ విభాగం ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. ఇందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపోలో హాస్పిటల్స్) భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం ఎనిమిది సంస్థలకు చెందిన కన్సార్టియం దీనిని నిర్వహిస్తున్నది. ఇందులో బ్లూడార్ట్ మెడ్ ఎక్స్ప్రెస్ కన్సార్టియం (స్కై ఎయిర్), హెలికాప్టర్ కన్సార్టియం (మారుత్ డ్రోన్స్), క్రూయిజ్ ఫ్లై కన్సార్టియం (టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్) ప్రతినిధులు ఇప్పటికే వికారాబాద్కు చేరుకున్నారు.