హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా సాధికారతకు కృషిచేస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఏపీలోని విశాఖపట్నంలో కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డితోపాటు 14 రాష్ర్టాలకు చెందిన చైర్పర్సన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో మహిళా కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్కు సునీతారెడ్డ్డి వివరించారు. మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి, మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్ , గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, సెక్రటరీ కృష్ణ కుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.