హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విడదల రజని తెలంగాణ ఆడబిడ్డ అనే విషయం చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని ఏపీ మంత్రి కావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రజని తండ్రి సత్తయ్య 40 ఏండ్ల క్రితం సికింద్రాబాద్లోని సఫిల్గూడకు వలస వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు. రజని రెండో కూతురు. సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతరం ఎంబీఏ చదివారు.
హైదరాబాద్లోనే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఏపీలోని చిలకలూరి పేటకు చెందిన విడదల కుమారస్వామితో రజనికి వివాహమైంది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రజిని బరిలో నిలిచారు. అగ్రవర్ణ నేతలకు ఎదురునిలిచి గెలిచిన తొలి బీసీ (ముదిరాజ్) మహిళగా రజని చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.)