యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ రికార్డే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ బిడ్డ పడమటి అన్వితారెడ్డి మరో సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. అంటార్కిటికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించారు. సముద్ర మట్టానికి 4,892 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాగ్రంపై ఈ నెల 17న కాలుమోపారు. భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డి.. ఇక్కడే ట్రెక్కింగ్లో శిక్షణ తీసుకున్నారు.
ప్రస్తుతం భువనగిరిలోనే రాక్ క్లైంబింగ్ స్కూల్ నడిపిస్తున్నారు. కోచ్ శేఖర్బాబు నేతృత్వంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యంత ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తున్నారు. ఈ నెల 8న విన్సన్ మాసిఫ్ బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల చలిలో ఎనిమిది మందితో కూడిన బృందం యాత్రను కొనసాగించింది. సుమారు 30 కిలోల లగేజీతో సుదీర్ఘ యాత్రను కొనసాగించి.. విజయవంతంగా సమ్మిట్ పూర్తి చేశారు.