హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన/తప్పిపోయిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ మరోసారి మొదటి స్థానంలో నిలిచిందని సీఈఐఆర్ సూపర్ యూజర్, సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 33.71 శాతం రికవరీ రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (32.09 శాతం), ఆంధ్రప్రదేశ్ (30.01 శాతం) ఉన్నట్టు తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి శనివారం వరకు 239 రోజుల్లో 15,024 ఫోన్లను బాధితులకు అప్పగించినట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా మహేశ్ భగవత్ బృందాన్ని డీజీపీ రవిగుప్తా అభినందించారు. మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్.. సీఈఐఆర్ పోర్టల్ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా తెలంగాణలోని 780 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరించి, ఫోన్లను కనుగొంటున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ 1,790 ఫోన్ల రికవరీతో మొదటి స్థానంలో ఉండగా సైబరాబాద్ కమిషనరేట్ 1,488 ఫోన్ల రికవరీతో నిలిచినట్టు చెప్పారు. తన బృందంలో చురుగ్గా పనిచేస్తున్న వారికి ఏడీజీ మహేశ్భగవత్ శుభాకాంక్షలు తెలిపారు.