టాప్-10 రాష్ర్టాల్లో నిలిచిన తెలంగాణ
2020-21లో దేశవ్యాప్తంగా రూ.5.554 కోట్ల లావాదేవీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలో అత్యధికంగా నగదురహిత చెల్లింపులు జరుగుతున్న టాప్-10 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలువగా.. మెట్రో నగరాల జాబితాల్లో హైదరాబాద్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ, కోల్కతా, కోయంబత్తూరు అహ్మదాబాద్, వడోదర ఉన్నట్టు ‘వరల్డ్ ఇండియా’ సర్వే వెల్లడించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది. టాప్-10 రాష్ర్టాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 80% ఆర్థిక లావాదేవీలు డిజిటల్ పద్ధతుల్లోనే జరుగుతున్నాయని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నగదురహిత చెల్లింపులవైపు మొగ్గుచూపడమే ఇందుకు కారణమని ఈ నివేదిక తేల్చింది. ఐదేండ్ల క్రితం దేశంలో రూ.1,004 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం రూ.5,554 కోట్లకు చేరినట్టు స్పష్టం చేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఆర్టీజీఎస్తో కలిపి రోజూ రూ.21.70 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్టు వెల్లడించింది. మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 67% ప్రైవేట్ బ్యాంకుల ద్వారా, 27% ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా జరుగుతున్నట్టు పేర్కొన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు 225 కోట్ల పీపీఐలు (ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్) ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.