భారత ఎన్నికల చరిత్రలో తెలంగాణ సరికొత్త అధ్యాయానికి వేదికయ్యింది. భవిష్యత్తు ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే ఆవిష్కరణ చేసింది. దేశంలో అత్యాధునిక టెక్నాలజీలకు నెలవుగా మారిన తెలంగాణ.. ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా ఓటువేసే యాప్ను అభివృద్ధి చేసింది. ఇలాంటి విశిష్ఠ యాప్ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. ‘టీఎస్ఈసీ ఈ-ఓట్’ అని పిలిచే ఈ యాప్ బ్లాక్చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల సాయంతో పనిచేస్తుంది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఐటీశాఖకు చెందిన ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడీఏసీ) సంయుక్తంగా ఈ యాప్ను అభివృద్ధి చేశాయి.దీనికి భిలాయ్ ఐఐటీ డైరెక్టర్ రజత్ మూనా నేతృత్వంలోని ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందం సాంకేతిక సలహా కమిటీగా వ్యవహరించింది.
ఈ-ఓట్ యాప్నకు నిపుణులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు విజయవంతమయ్యాయి. త్వరలో ఖమ్మం జిల్లాలో నమూనా ఓటింగ్ (డ్రై రన్) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ఓటర్లను రిజిస్టర్ చేసి, 20న డమ్మీ ఓటింగ్ నిర్వహిస్తారు. జిల్లావాసులంతా ఈ డ్రైరన్లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ‘టీఎస్ఈసీ ఈ-ఓట్’ యాప్ ఇంగ్లిష్లో, తెలుగులో పనిచేస్తుంది. ఓటువేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇందులో కొన్ని వీడియోలను సైతం పొందుపరిచారు.
ఈ-ఓట్ ద్వారా ఓటేయాలనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి లాగిన్ ఐడీ ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో, ఓటువేసే సమయంలో ఒకే ఫోన్ను వినియోగించేందుకు లాగిన్ ఐడీని ఫోన్ ఐఎంఈఐ నంబర్కు, ఫోన్నంబర్కు అనుసంధానిస్తారు. ఓటింగ్ సమయంలో ఈ యాప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మూడు దశల్లో ఓటర్ను గుర్తించి ఓటు వేసేందుకు అనుమతిస్తుంది.
ఈ మూడు మార్గాల్లో జాబితాలోని వ్యక్తి, ఫోన్ ముందున్న వ్యక్తి ఒక్కరే అని నిర్ధారించుకుంటుంది. ఆ తర్వాత ఓటు వేసేందుకు అనుమతి ఇస్తుంది. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీల్లేకుండా ఈ-ఓటును బ్లాక్చైన్ టెక్నాలజీ సాయంతో ఎన్క్రిప్టెడ్ మెసేజ్ రూపంలో సర్వర్కు చేరవేస్తుంది. ఈ సమాచారం మొత్తం స్టేట్ డాటా సెంటర్లలో నిల్వ చేస్తారు.
పోలింగ్ కేంద్రాలకు రాలేనివారికి ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించాలనే డిమాండ్లు తరచుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఈ-ఓటింగ్’కు ఒక వేదిక ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బ్లాక్చైన్, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీలకు తెలంగాణ వేదికైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పరిశోధనలు చేసింది. దివ్యాంగులు, వృద్ధులు, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాధిగ్రస్థులు, పోలింగ్ సిబ్బంది, ఐటీ ఉద్యోగుల్లాంటి వారికి ఆన్లైన్ ఓటింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక టెక్నాలజీలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విరివిగా వినియోగిస్తున్నది. వాటి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా వచ్చిన మరో ఆవిష్కరణే ఈ-ఓట్. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయలేని స్థితిలో ఉన్నవారికి సాయం చేసేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది.