Telangana Police | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో అమలుచేస్తున్న 33.03% రిజర్వేషన్ దన్నుతో తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా 2,125 మంది మహిళా కానిస్టేబుళ్లు అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ స్టేట్లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ఎస్సై తుది ఫలితాల్లోనూ 153 మంది మహిళలు ఎంపికయ్యారు. కొత్తగా విధుల్లోకి చేరబోతున్న మహిళా ఎస్సైలకు రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. టీఎస్ఎల్పీఆర్బీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మొత్తం సివిల్ పోస్టుల్లో 33.03% పోస్టులు మహిళలకు కేటాయించారు. దీంతోపాటుగా ఏఆర్, తత్సమాన పోస్టుల్లో సైతం 10%ం రిజర్వేషన్ కల్పించారు. దీంతో ఈ రిక్రూట్మెంట్లో 2,125 మంది మహిళా కానిస్టేబుళ్లు కొత్తగా విధుల్లోకి చేరనున్నారు.
మూడు కేంద్రాల్లో శిక్షణ: ఐజీ తరుణ్జోషి
పోలీస్శాఖలోకి అడుగుపెట్టనున్న మహిళా పోలీసులకు రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైనింగ్ విభాగం ఐజీ తరుణ్జోషి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. వరంగల్లో వెయ్యిమందికి, పోలీస్ అకాడమీలో 683 మందికి, మేడ్చల్లో 442(ఏఆర్) మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ మొదటి వారంలో శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. మహిళా కానిస్టేబుళ్ల సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చే మూడు ప్రదేశాల్లో అన్ని వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. రాత్రివేళల్లో భద్రత కోసం అదనంగా సిబ్బందిని నియమిస్తామని అన్నారు. పురుషులకు ఇచ్చిన ఇండోర్, అవుట్డోర్ శిక్షణే మహిళలకు కూడా ఇప్పిస్తామని స్పష్టంచేశారు.