హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలను దేశమంతటా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ సుదర్శన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలోని ఆర్టీఎం నాగపూర్ యూనివర్సిటీలో నిర్వహించిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న ఆయన దేశంలో అమలు చేయాల్సిన వ్యవసాయ విధానాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా 12 అంశాలను సిఫార్సు చేశారు.
దేశాభివృద్ధిలో వ్యవసాయం చాలా కీలకమని, అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో రైతు భవన్లు, గోదాములు నిర్మించాలని పేర్కొన్నారు. రసాయనాలతో సాగవుతున్న పంటలు కాకుండా రైతులను క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని, విద్యార్థి దశలోనే వ్యవసాయ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన వెటర్నరీ, పట్టు పరిశ్రమ, చేపల పెంపకంపై పాఠాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నదని సిఫార్సుల్లో సూచించారు.