హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతి ఏడాది బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.12,655.10 కోట్ల రుణాలు ఇచ్చింది.
వాస్తవానికి 2,62,485 ఎస్హెచ్జీలకు రూ.12,046.39 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, అంతకుమించి 105.05 శాతం రుణాలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 3,47,773 ఎస్హెచ్జీలకు రికార్డు స్థాయిలో రూ.15,001.42 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు సిద్ధంచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఆదేశాలు జారీచేశారు.