రోడ్డంటే తారు కలిపిన కాంక్రీటు పరచిన దారి కాదు. పురిటినొప్పులను పంటి బిగువున భరించిన ఏ తల్లినడిగినా ‘రోడ్డంటే.. చావుపుట్టుకలను శాసించే ప్రాణదారి’ అని చెబుతుంది. రోడ్డు లేకపోతే అవకాశాల దారులూ మూసుకుపోయినట్టే. ప్రకృతి వరాల్లాంటి వనరులున్నా, రోడ్డు లేకపోతే ఆ ఊరికి ఏమీ లేనట్టే. ‘అంబులెన్సుకు దారేది? పల్లెవెలుగు వచ్చేదెన్నడో?’.. అంటూ పాలకుల్ని వెక్కిరించిన ఒకనాటి పతాక శీర్షికలన్నిటినీ కనుమరుగు చేసి, ప్రతి ఊరూ ప్రపంచానికి చేరువయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ. సాకారమైన స్వరాష్ట్రంలో అభివృద్ధికి సరిహద్దులు చెరిపేసి అష్టదిక్కులా ప్రగతిబాటలే సింది సర్కారు. బంగారు తెలంగాణకు రోడ్లే మణిహారాలు! మైలురాళ్లే మన గెలుపు మలుపులు. నిన్నటి పాలకుల మాటలు నీటి మీద రాతలని నిరూపించిన ఆనవాళ్లపై రహదారి స్వప్నాలు నిజం చేసి, ఇదంతా మన తలరాత అని రాజీపడ్డ జనాన్ని రాస్తా మీదకు తీసుకొచ్చింది తెలంగాణ! ‘రోడ్ల కోసం రాస్తారోకోలు’ చేసే రోజులు పోయి రోజుకో పని మీద రైతులు రాస్తాపై తిరిగే రోజులొచ్చినయ్!
ఇదొక గూడెం కథ. ఏ ఊరిల లేనట్టు ‘ఓడపన్ను’ ఉండేదక్కడ. దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మూడేండ్ల కిందటి దాంక ‘ఓడపన్ను’ కడుతుండె. అదేమీ స్వయం పాలన ప్రకటించుకున్న ప్రాంతం కాదు. పాలకులు దశాబ్దాలుగా పట్టించుకోని ప్రాంతం. ‘ఏ పన్ను కట్టినా, కట్టకున్నా మా ఊళ్లో బతకొచ్చు. కానీ, ఓడపన్ను కట్టకుంటే బతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే’ అంటూ మూడేళ్లకు ముందు జీవితాన్ని గుర్తుచేస్తున్నడు అరవై ఏండ్లు పైబడిన చంద్రగిరి పెంటయ్య. భూములున్న రైతులే కాదు, కూలీనాలీ చేసుకునే జనం కూడ సచ్చినట్టు ఓడపన్ను కట్టి బతికి బట్టకట్టిండ్రు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఊరికి తొవ్వొచ్చింది. ఉపాధి అవకాశాలు
పెరిగినయ్. భూముల ధరలు పెరిగినయ్. దీంతో తొవ్వ వెనకాలే బువ్వ వచ్చింది.
తెలంగాణ వారధి
గూడెం.. ఆదిలాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని గ్రామం. భౌగోళికంగా తెలంగాణకు అంచున, మహారాష్ట్రకు సరిహద్దున ఉంది. ప్రాణహితకు ఈ దరిన ఉంటే, అహెరికి ఆ దరిన ఉంటుంది.. నడుమ మూడు కిలోమీటర్ల దూరం. పురిటినొప్పులు వచ్చినా, పురుగు కుట్టినా అహెరి పోవాలె. ‘పాతికేండ్ల క్రితం ఆ మూడు కిలోమీటర్ల ప్రయాణం కోసం వంద రూపాయలు కట్టేది. మా ఊరికి 60 కిలోమీటర్ల దూరంల ఉన్న కాగజ్నగర్కు ఆర్టీసీ బస్సుల పోతే.. 16 రూపాయలు చార్జీ. ఆపత్కాలంల దగ్గర దారే మేలు. కాబట్టి ఓడ ఎక్కుతం. ప్రాణాలు కాపాడుకోనీకి ప్రాణహితను దాటాలంటే వంద రూపాయలు కట్టాల్సిందే. అప్పట్ల వంద రూపాయలతోని 370 కిలోమీటర్ల దూరంల ఉన్న హైదరాబాద్ పోవచ్చు! డబ్బులే కాదు ప్రాణాలూ పోగొట్టుకున్నం. ఓపాలి పడవ మునిగితే ఇద్దరి ప్రాణాలు గంగలో కలిసినయ్.
ఎన్నిసార్లు వంతెన కట్టమని అడిగినా పట్టించుకున్నోడే లేడ’ని గూడెం పంచాయతీ ఉప సర్పంచ్ ఎండీ ముషారఫ్ అలీ అంటున్నడు. ఆయనొక్కడే కాదు, గూడెం చుట్టుపక్కల ఉన్న బూరుగూడ, కోయపల్లి, నాగెపల్లి, దొడ్డిగూడ, మొగవెల్లి, మురళిగూడ, దిండ, చిత్తం ఊర్ల జనమందరిదీ ఇదే గోస. ‘నదిల పడవ ప్రయాణం ఎవరికైనా సాహసమే. మాకు మాత్రం ఓ అవసరం. అది తీర్చనీకి కొంతమంది ఓడలు నడిపిండ్రు. ప్రాణహిత పక్కన ఉన్న అన్ని ఊళ్లల్ల ఓడలోళ్లుండ్రు. మా ఊళ్లె ఇరవై కుటుంబాలు ఓడ నడిపేది. కొంతమంది జీవితమంతా ఓడ నడిపే బతికిన్రు. కూరగాయలు, బట్టలు, సరుకులు తెచ్చుకోనీకి ఓడ ఎక్కాలె. అహెరి పోయి రావాలె. సర్ది చేసినా, సిన్మా సూడాలన్నా అటు దిక్కే. ఏడాదికి ఎనిమిది కుంచాల జొన్నలు, తవ్వెడు పల్లీలు ఇస్తే ఒక ఇంటోళ్లందరూ ఏడాది కాలం ఓడ ఎక్కొచ్చు. పంట పండకుంటె గింజలు కొని ఇయ్యాలె. సరంగు సల్లంగ బతికితే ఊరు బతికినట్టే.
‘కాలం గిర్రున తిరిగింది.
తెలంగాణ అచ్చింది. కేసీఆర్ సార్ బ్రిడ్జ్ కట్టనీకి వంద కోట్లిస్తన్నడు. 65 కోట్లతోనే పనైపోయింది. బ్రిడ్జ్ని సూత్తే దారమేసినట్టుంది! ఇది కట్టినంక తేలిగ్గ పోయి రావొచ్చనుకున్న. ఇప్పుడట్ల లే. మంగళారం నాడు మా ఊరికే సరుకులు తెచ్చి మార్కెట్ పెడుతున్నరు. పొద్దునే సైకిల్ మోటర్లు, ట్రాలీల మీద కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, బిందెలు అమ్మేటోళ్లొస్తున్నరు. బ్రిడ్జి కట్టినంక మా ఆడోళ్లకు సుఖమొచ్చింది’ అని చెబుతున్న పెంటయ్య మాటలు నిన్నటికీ నేటికీ వారధి తెచ్చిన మార్పును కళ్లకు కడుతున్నయి. ఒకానొకప్పుడు ఈ ఊరికి 60 కిలో మీటర్ల దూరంల ఉన్న కాగజ్నగర్ నుంచి బస్సు వస్తే మామిడాకులు కట్టి, హారతి పట్టి పూజలు చేసిండ్రట. ప్రగతికి వారధినేసిన తెలంగాణ సర్కారుకు, కేసీఆర్ సారుకు పెంటయ్యే కాదు ప్రాణహిత పక్కనే ఉన్న పల్లెలన్నీ కృతజ్ఞతలు చెబుతున్నయి.
‘తొవ్వెమ్మటి ఎకరం భూమి
లక్ష రూపాయలు పలికేది. ఇప్పుడు రెండు లక్షలకు గుంట భూమి వస్తది. ఎంత మార్పు తెచ్చింది వారధి! తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత పొంటే ఉన్న చిట్ట చివరి భూములు ఒకప్పుడు ఎకరం లక్ష రూపాయలు అయితే, గూడెం బ్రిడ్జ్ నిర్మాణం అయినంక ఎకరం ఆరు లక్షలు!
– అంజిత్ పటేల్, గూడెం
అభివృద్ధి కుదురులో రోడ్ పాలసీ!
‘పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు’ అని ఏలేటోళ్లు మాటలు చెప్పిండ్రు. కానీ, పల్లెను ప్రగతిబాట పట్టించడం మాత్రం మరిచిండ్రు. చెటాక్ మొరం పోయకుండా మాటలు చెప్పిన ఆ లీడర్లనూ మరిచిపోయిండ్రు జనం. తెలంగాణ వచ్చినంక.. సాకారమైన స్వరాష్ట్ర ఆకాంక్షలు ఫలించాలంటే పల్లెను ప్రగతిపథంలో నడుపాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. పల్లెపల్లెకూ రాచబాటలు వేయాలని సంకల్పించింది. తొమ్మిదేండ్లల్ల 11,323 కిలో మీటర్ల కొత్త దారులేసి, 4,233 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లేసి బంగారు భవిష్యత్కు ‘కొత్తబాట’లేసింది. రోడ్డు అడవులను చేరింది. వాగులు దాటింది. కొండలెక్కింది. ఎన్ని ఇళ్లున్నాయని కాదు, అభివృద్ధి ఫలాలు అందరికీ పంచాలని రోడ్డు ఆదివాసీ గూడెం చేరుకుంది. ప్రతి పల్లెనూ మండల కేంద్రానికి కలిపింది. మండలాలన్నిటినీ డబుల్ రోడ్తో జిల్లా కేంద్రానికి చేర్చింది. అక్కడినుంచి నాలుగు లైన్ల రోడ్ రాజధానికి దారితీసింది. సుఖవంతమైన ప్రయాణానికి, సౌకర్యవంతమైన జీవ నానికి మౌలిక వనరులు కల్పించింది తెలంగాణ సర్కార్. పల్లెల్లో కాపుకొచ్చిన అభివృద్ధి ఫలాలకు పాదులు ఈ రాచబాటలే! అభివృద్ధి, ఆదాయం, ఆరోగ్యం, సంక్షేమం.. ఏదైనా సరే దేశంలో తెలంగాణ నంబర్ వన్గా నిలబెట్టింది రహదారే! మన దారి రహదారి!
తెలంగాణ ఊటీలో…
కూర్గ్, కొడైకెనాల్, ఊటీ, మున్నార్, లంబసింగి, అనంతగిరే కాదు.. వాటికి దీటైన అందాలు అడవుల జిల్లా ఆదిలాబాద్ల ఉంది.. ఖండాల. ఎత్తయిన గుట్టలపై దట్టమైన అడవులు, వంపులు తిరిగే దారులు, జలజల జారే జలపాతాలతో కూడిన ఖండాల గుట్టలెక్కితే మబ్బుల దగ్గరికి పోయినట్టే ఉంటది. ఆదిలాబాద్ జిల్లా అందం చూడాల్నంటె సముద్ర మట్టానికి 1,758 అడుగుల ఎత్తున ఉన్న ఈ గుట్ట ఎక్కాలె! అన్ని అందాల మధ్య జీవించే ఖండాల, దాని పరిసర గ్రామాల ప్రజల జీవితం మాత్రం అంత అందంగా లేదని అక్కడ ఎవ్వల్ల నడిగినా చెబుతరు. దారుల్లేని అందాలు అడవిగాచిన వెన్నెల లెక్కే మరుగునపడ్డయ్.
అడవిగాచిన వెలుగు దారి
ఖండాల బయటినుంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్టుంటది. మండలాఫీసుకు, దవాఖానకు పోవల్నంటే ఆ ఊళ్ల జనాలు ఆకాశం దిగి రావాల్సిందే. ఇక్కడ ఆదివాసీలు, లంబాడాలు ఎక్కువ. బలరాం నాయక్ ఖండాల తండాలో పెద్దమనిషి. ఒకప్పుడు గుండెలు బాదుకున్న విషయాన్ని ఆయన ఇప్పటికీ మర్చిపోలే. ‘సర్ది చేశి నాలుగు రోజుల్ల తగ్గలేదంటే ఇగ పానం పోయినట్టే. పురిటి నొప్పులొచ్చినా, పాము కరిచినా ఎంత బాధ పడాల్నో. అయిదారుగురం జమయ్యి కస్లాం కట్టుకుని తీస్కోయేది. చంద్రబాను రాథోడ్, సక్రు జాదవ్ని ఇంద్రవెల్లి దవాఖానకు తీస్కపోతుంటె నా చేతిలనే ఇద్దరి పానాలు పోయినయ్. పాటగూడల పాము కరిచి ఇద్దరు పిల్లలు చచ్చిపోయిండ్రు. రోడ్డు లేక, కరెంటు లేక, నీళ్లు లేక అయిదేళ్ల కిందటి దాంక పడ్డ గోసలన్నీ చెబుతున్నడు. అట్టడుగు జీవితాల్ని ఖండాల గుట్టలంత ఎత్తుకు తీసుకొచ్చింది బంగారు తెలంగాణ. ఇది అతిశయోక్తి కాదు. ‘మా గూడేలకు ఏడేళ్ల కింద బీటీ రోడ్డొచ్చింది. ఇటు ఇంద్రవెల్లికి, అటు ఆదిలాబాద్కి.. ఎటంటే అటు పోవచ్చు. అయిదేళ్ల కింద భగీరథ నీళ్లొచ్చినయ్. అయ్యొచ్చినంక ఇగ తక్లీఫ్ లేదు. మూడేళ్ల కింద కరెంటు వెలుగొచ్చింది. ‘ఇన్ని తెచ్చిన జోగు రామన్నకు, అన్నీ ఇచ్చిన కేసీఆర్ సారుకు దండాలు’ అంటున్నడు బలరాం నాయక్. కొండపై కష్టాలు పోయినా పాత బాధలు మర్చిపోలే. ‘గుర్తుంచు కుని వేస్తం ఓట్లు!’ అని బాజాప్తా చెబుతున్నడు.
మూడొద్దులకు స్నానం
రోడ్డులేని చోట జీవితమెంత దుర్భరమో మడవి రుక్మాబాయి చెప్తున్నదిలా.. ‘ఎండకాలమొస్తె పాటగూడల నీళ్లు లేకుండె. సమక దగ్గర వాగుల తెచ్చుకునేది. అయిదు కిలోమీటర్లు నడిచిపోయి అక్కడే బట్టలుతుక్కుని, తానాలు చేసి కుండల్లో నీళ్లెత్తుకుని వచ్చేది. మా అమ్మతోని చిన్నప్పుడు పోయిన. అట్లనే నేను పెద్దయిన. నా పిల్లల్నీ తీస్కపోయిన. ఎండల్ల నీళ్లు మోయలేక రాత్రి పూట పోయేటోళ్లం. పిలగాండ్లు అంతదూరం నడవలేక ఏడుస్తుండె. కొట్టుకుంట తీస్కపోయేది. రోజూ అంతదూరం రాలేరని రెండు మూడు రోజులకోపాలి తానం చేయించేది. అన్ని బాధలువడ్డం’. ఆమె మాటల్లో ఇప్పటి కాలానికి వెయ్యేళ్లు వెనుకబడిన జీవితం కనిపిస్తున్నది.
తెలంగాణతోనే స్వాతంత్య్రం వచ్చినట్టు!
తెలంగాణ రాకముందు.. సరిహద్దు గ్రామాలకే రోడ్డు సమస్యలు ఉండేవనుకుంటే దారితప్పినట్టె! గత పాలకుల నిర్లక్ష్యానికి సరిహద్దుల్లేవు. జిల్లా కేంద్రాలకు కూతవేటు దూరంలనే వందల పల్లెలు రోడ్డు లేక, వెనుకబాటుకు చిరునామాగా, పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా ఉండేవి. ఆదిలాబాద్ పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంల ఉన్న గూడేలకే కాదు, జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మండలంలనే రోడ్డు లేని ఊళ్లున్నాయి. ఆరు కిలోమీటర్ల దూరమున్న చిట్యాల్ బోరికి ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో మట్టి రోడ్డు లేదు. వంద ఇండ్లున్న ఆ ఊళ్లో బతికే గోండులు ఊరు దాటాలంటె కాలిబాటే దిక్కు. వానకాలమొస్తే ఊరు దాటాలంటే ఎన్ని కష్టాలో? పురుడొచ్చినా ఊళ్లనె. రోగ మొచ్చినా ఊళ్లనె. ఊరి బయటే చదువు. ఓసారి.. ఒకామెకు అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చినయ్. కస్లాం (ఎడ్లబండి) కట్టుకుని అయిదారుగుర్ని వెంటబెట్టుకుని అర కిలోమీటరు నడిచిపోయినం. ఊరికి రెండు దిక్కులా ఒర్రె పారుతున్నది. ఎటు తిరిగినా దారి కనవడట్లే. ఆ రాత్రంతా తండ్లాడినం. తెల్లారింది. ఒర్రెలో పారే నీరు కొంచెం తగ్గినంక దాటి పోయినం.
ఆదిలాబాద్ దవాఖానకు తీస్కపోయినం. అప్పటికి మాపటేల అయిదు గంటలైంది. ఆ తల్లి కడుపులనే బిడ్డ సచ్చిపోయిందని డాక్టర్లు చెప్పిండ్ర’ని ఆశా వర్కర్ అనసూయ చెప్పింది. వానకాలమొస్తే మా గూడేలకు సావొచ్చినట్టే. రోడ్డులేనప్పుడు పురిటినొప్పులతో ఉన్న ఆడబిడ్డని దవాఖానకు చేర్చలేక సంపుకొన్నం. అప్పటిసంది.. ఏ తల్లి కడుపుల బిడ్డ పడినా గుండెల్లో భయం మొదలయ్యేది. దవాఖానకు పోవాల్నంటె బాధ. కస్లాం కట్టుకుని మూడు కిలోమీటర్లు పోవాలె. మొన్నటి దాంకా ఇట్లనే మా బతుకు. ఇప్పుడు దారొచ్చింది. మా బతుక్కి భరోసా తెచ్చింది!’ అని సంతోషాలకు దారిచూపిన మట్టిరోడ్డును చూపిస్తూ చిట్యాల్ బోరి ఆదివాసీ పూజారి తొడసం గంగారాం సంబురపడుతున్నడు. ఈ సంబురం ఆ గూడెం ఆదివాసీలందరిదీ.
గిట్ల మారింది తెలంగాణ
తెలంగాణ వచ్చినంక తండాలతోపాటు ఆదివాసీ గూడేలు కూడా గ్రామ పంచాయతీలు అయినయ్. స్వయం పాలనతోనే సగం దరిద్రం వదిలింద’ని ఆదివాసీలు అంటున్నరు. 30 లక్షల రూపాయల పంచాయతీ రాజ్ నిధులతోని గూడెంల అర కిలోమీటరు సిమెంట్ రోడ్ వేసుకున్నరు. ఆదిలాబాద్కు పోయే తారు రోడ్డు కలిసేట్టు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు పోసుకున్నరు. రెండు కల్వర్టులు మంజూరు చేయించుకున్నరు. ‘ఎప్పుడంటే అప్పుడు ఊరికి వచ్చేట్టు, పోయేట్టు సౌలత్ వచ్చింది. తొందర్లనే మంచి రోడ్డొస్తద’ని సర్పంచ్ లక్ష్మి సంతోషంగా చెప్పింది.
ఇన్నేండ్లకు అందరితో సమానంగా, అందరిలా బతికే రోజులు వచ్చినందుకు ఆ ఆదివాసీ గూడెం సంబురంగా ఉంది. ఇట్ల గూడేలకు, తండాలకు, చిన్నచిన్న గ్రామాలకు తొమ్మిదేండ్లల్ల 11,323 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసుకుంట పోయిన్రు. నాలుగైదు ఇండ్లున్న గూడేల నుంచి పదుల సంఖ్యల ఇండ్లున్న గూడేలకు ఒకప్పుడు దారే ఉండకుండె. అసుంటి గూడేలకూ దారొచ్చింది. ‘ఒక్క మనిషి ఉన్నా దారి సూపియ్యాలన్నట్టు’ మట్టి రోడ్లు, కచ్చారోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసుకుంట పోయిన్రు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని రోడ్లు కలిపి 20,281 కిలోమీటర్లు ఉంటే, ఇప్పుడు 28,709 కిలోమీటర్ల పొడవున్నయ్. ఎనిమిది వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేల ఊళ్లని కలిపి, ఎంతోమంది గోస తీర్చినయ్! గిది గదా బంగారు తెలంగాణమంటే!
…? నాగవర్ధన్ రాయల
– ఎం.గోపీకృష్ణ