హైదరాబాద్, మార్చి31 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల నియమాక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) దబాయిస్తున్నది. దీంతో అర్జీదారుల హక్కులను కాలరాస్తున్నది. బోర్డు వైఖరిపై అభ్యర్థులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత పాటించడమంటే ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిబ్ ఇటీవలే 8,708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. 8,304 పోస్టులను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఆయా సొసైటీలకు అలాట్ చేస్తూ నియామకపత్రాలను అందజేసింది. అయితే ట్రిబ్ మాత్రం ఇప్పటివరకు జనరల్ ర్యాంక్ జాబితాను వెబ్సైట్లో పొందుపరచలేదు. దీంతో చాలామంది అభ్యర్థులు తాము ఎందుకు పోస్టుకు ఎంపిక కాలేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఆదిలాబాద్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఫిబ్రవరి 26 న ఇదే విషయమైన ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టుల కటాఫ్ మార్కులు ఎన్ని? రూల్ రిజర్వేషన్ ఎలా పాటించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారనే అంశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వివిధ జిల్లాల నుంచి సైతం ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ అభ్యర్థులు పలువురు వివిధ రకాల సమాచారాన్ని కోరుతూ ఆర్టీఐ కింద అర్జీలను పెట్టుకున్నారు. కానీ ట్రిబ్ మాత్రం వారందరికీ ఒకే సమాధానాన్ని ఇటీవల పంపించింది.
‘నియామక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నది. మీరు అడిగిన సమాచారం ఇవ్వడం ఇప్పుట్లో సాధ్యం కాదు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక బోర్డు వెబ్సైట్లోనే ఆ సమాచారాన్ని పెడతాం. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు’ అంటూ ట్రిబ్ తేల్చిచెప్పిం ది. ట్రిబ్ సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భర్తీ ప్రక్రియ సమాచారాన్ని వెల్లడి చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులకు నియామకపత్రాలను అందించాక కూడా ఎందుకు బయటపెట్టడంలేదని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇతర బోర్డులకు విరుద్ధంగా ట్రిబ్ వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల భర్తీకి ప్రతి విషయంలోనూ గోపత్య పాటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.
2018, 2019లో మాదిరిగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను ఎందుకు ప్రకటించలేదని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాక జీఆర్ఎల్ను వెల్లడిస్తే లాభమేమిటని? ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరిని అడగాలని, కోర్టుల చుట్టూ తిరగాలా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీఆర్ఎల్ను ప్రకటించాలని వారు పట్టుబడుతున్నారు. గతంలో అభ్యర్థుల వ్యక్తిగత ఐడీల్లో ట్రిబ్ గతం లో పొందుపరించింది. ఆ విధానానికీ ఈ సారి ట్రిబ్ స్వస్తి పలికింది.
గురుకుల పోస్టుల భర్తీ విషయంలో ఏ ఒక్క అంశంలోనూ పారదర్శకత పాటించలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే వేలాది మం ది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను అర్ధరాత్రి వరకు హడావుడిగా నిర్వహించిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లాయని మండిపడుతున్నారు. నియాకమ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అనేక మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసుల విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే జేఎల్ బోటనీ, నాన్జాయినింగ్ పోస్టుల తీరును తప్పుబడుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు జీఆర్ఎల్ను ప్రకటిస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశముంటుందని, ఈ నేపథ్యంలోనే ట్రిబ్ అందుకు జంకుతున్నదని గురుకుల అభ్యర్థులు వివరిస్తున్నారు.