హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లోనే కాదు.. టెన్త్ ఫలితాలతో పాటు ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి యూనివర్సిటీల నుంచి అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల్లోనూ గురుకుల విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే సాధ్యమయ్యాయి. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ ఫస్టియర్లో గురుకుల కాలేజీల విద్యార్థులు 73.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 78.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఇక ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఫస్టియర్లో 47.70 శాతం, సెకండియర్లో 63.56 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రయివేటు కాలేజీల విషయానికి వస్తే ప్రథమ సంవత్సరంలో 66.50 శాతం, సెకండియర్లో 68.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.