న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాలుష్య నియంత్రణకు ఏయే చర్యలు చేపడుతున్నారో ఎప్పటికప్పుడు ప్రజలు వెల్లడించే విషయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇన్విరాన్మెంట్(సీఎస్ఈ) విడుదల చేసిన పారదర్శక సూచీ(ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్)లో 67 స్కోరుతో మొదటి ర్యాంకు సాధించింది. దేశంలో 29 రాష్ర్టాల కాలుష్య నియంత్రణ బోర్డులు, ఆరు కాలుష్య నియంత్రణ కమిటీలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణకు ఇవి చేపట్టే కార్యక్రమాలను, నిర్ణయాలను తమ వెబ్సైట్లు, ప్రకటనలు, వార్షిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. అయితే చాలా రాష్ర్టాలు దీన్ని పాటించడం లేదని సీఎస్ఈ పేర్కొన్నది. సమాచార వెల్లడిలో గడిచిన ఐదేండ్లలో వివిధ బోర్డుల పనితీరుపై 25 అంశాల ఆధారంగా అధ్యయనం చేసి ర్యాంకులను కేటాయించింది. తెలంగాణతో పాటు ఒడిశా కూడా 67 స్కోరుతో సంయుక్తంగా మొదటిస్థానంలో ఉండగా, 65.5 స్కోరుతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.