Telangana | రాష్ట్రంలో పోలీసుల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని పోలీసు నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమాల గురించి తెలిస్తే పోలీసు నియామక మండలికి దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అక్రమాలపై పక్కా సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల పారితోషికం ఇస్తామని తెలిపారు.
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేశారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యిందని చెప్పారు. గత నెల 14 నుంచి 26వ తేదీ వరకు 97 వేల మందికి పైగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశామని వెల్లడించారు. మూడు దశల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టామని అన్నారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యిందని అన్నారు. వయసు, విద్యార్హత లేకున్నా కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని.. వారి దరఖాస్తులు తిరస్కరించామని వెల్లడించారు