హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీస్శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నేరాల దర్యాప్తులో నాణ్యతను పెంచేందుకు సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్) 2.0 వెర్షన్ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం సీసీటీఎన్ఎస్ 2.0 మొబైల్, వెబ్ వెర్షన్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల సీపీలు, అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీసీటీఎన్ఎస్ 2.0 వెర్షన్ను తొలుత 180 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించాక అమల్లోకి తెచ్చినట్టు డీజీపీ తెలిపారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ తరహా ఫీచర్లను కలిగి ఉండే ఈ వెర్షన్ నేరాల దర్యాప్తులో క్షేత్రస్థాయి సిబ్బందికి ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి, వెల్ఫేర్ అండ్ హోంగార్డ్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.