హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాయాల్లో ఇకపై కామన్ అకడమిక్ క్యాలెండర్ను అమలుచేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల తరగతులతోపాటు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకానున్న విద్యా క్యాలెండర్ను ఈ నెల 16న విడుదలచేసే అవకాశాలున్నాయి. ఆరు వర్సిటీలకు వేర్వేరు అకడమిక్ క్యాలెండర్లను అమలుచేస్తుండటంతో తలెత్తుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. మంగళవారం తన అధ్యక్షతన జరిగిన అన్ని యూనివర్సిటీల వీసీల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఆరు వర్సిటీల్లో ప్రవేశాలకు కామన్ పోస్టుగ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్ (సీపీగెట్) నిర్వహిస్తుండగా.. తాజాగా ఒకే అకడమిక్ క్యాలెండర్ను అమలుచేస్తామన్నారు. ఇప్పటికే డిగ్రీ కోర్సులకు సైతం కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలుచేస్తున్నట్టు గుర్తుచేశారు.
యూనివర్సిటీల్లో విద్యార్థుల కోసం హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొవిడ్ సహా ర్యాగింగ్, వ్యక్తిగత, మానసిక సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు వీటిని ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. ఇప్పటికే ఓయూలో సహా యం పేరుతో హెల్ప్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మిగిలిన వర్సిటీల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించారు. వర్సిటీ ర్యాంకింగ్స్లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నది. డిగ్రీలో 88 ప్రభుత్వ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందాయి. మిగతా కాలేజీలు గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టనున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.