ఏడున్నరేండ్ల క్రితం ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎలా ఉన్నదో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కరెంటు ఉంటే చాలా చాలా గొప్ప.. ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలకులు కట్టెలు పట్టుకొని మరీ నీతిసూత్రాలు చెప్పుకొంటూ వచ్చారు. మాతో లేకపోతే.. మమ్మల్ని కాదని విడిపోతే.. మీరు అంధకారంలో మగ్గిపోతారంటూ పిల్లి శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రం వచ్చినప్పుడు నిజంగా అదే పరిస్థితి. అందరిలోనూ అనుమానమే.. ఈ చీకట్లు తొలగిపోవడం సాధ్యమేనా? అందరికీ సందేహమే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత.. ముందు చూపు.. ఆర్నెల్లలోనే ఆ చీకట్లను పొలిమేరల అవతలికి తరిమేసింది. ఆ చీకట్లను చీల్చుకొంటూ తెలంగాణలో వెలుగు మొలకలు మొలిచాయి. 2022 నాటికి అవి కాంతులు విరజిమ్ముతున్నాయి. ఏపీలో మాత్రం అన్ని రంగాలూ విద్యుత్తు సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. ఉమ్మడిలో ఉండి ఉంటే.. మన గతీ ఇలాగే ఉండేదేమో!?
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): మండు వేసవిలో తెలంగాణలో వెలుగు రవ్వలు విరజిమ్ముతుంటే.. రాష్ట్రం వస్తే అంధకారంలో మగ్గిపోతారంటూ మాట్లాడిన ఆంధ్రప్రదేశ్తోపాటు.. దేశంలోని పదహారు రాష్ర్టాలు కరెంటు లేక.. చీకట్లలో బందీ అయిపోయా యి. లానినా ఎఫెక్ట్ ఉంటుందన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేదు. రాష్ర్టాల ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించలేదు. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకొనే ఒక్క ప్రయత్నమైనా చేయలేదు. దేశమంతటా అంధకారంలో ఉంటే.. తెలంగాణలో మాత్ర మే ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా ఎలా జరుగుతున్నది? అదీ 24 గంటలు నిరంతరాయంగా ఇవ్వగలగటం ఎలా సాధ్యపడుతున్నది? ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపుతో.. దార్శనికతతో చేపట్టిన కార్యాచరణ రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థను పటిష్ఠం చేసింది.
రాష్ట్రం వచ్చేనాటికి అత్యంత సంక్షోభంలో ఉన్న విద్యుత్తు వ్యవస్థను.. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏలను రద్దుచేసినా.. కృష్ణపట్నం కరెంటుకు కోతపెట్టినా.. అదరక బెదరక ముందుకు వెళ్లి.. పక్కా చర్యలతో ప్రభుత్వ విద్యుత్తు వ్యవస్థలను పటిష్ఠం చేసి ఆర్నెల్లలోనే సంక్షోభాన్ని అధిగమించడం.. ఆ తరువాత విద్యుత్తు వ్యవస్థలు కునారిల్లిపోకుండా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ రావడం వల్ల తెలంగాణలో విద్యుత్తు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించగలిగారు. మరోవైపు ఏపీలో ప్రజలకు విద్యుత్ కోతల వాతలు పడుతున్నాయి.
గృహ, వాణిజ్య, పరిశ్రమలకు కోతలు, పవర్ హాలిడేలు విధిస్తేనే రోజుకు కనీసంగా 30 మిలియన్ యూనిట్ల కరెంటు లోటు తలెత్తుతున్నది. లేకపోతే.. 50 నుంచి 60 మిలియన్ యూనిట్ల వరకు ఈ లోటు ఉంటుందని విద్యుత్తురంగ నిపుణులు చెప్తున్నారు. గృహ వినియోగ రంగానికే సగటున రోజుకు నాలుగైదు గంటలపాటు (రెండుమూడు విడతల్లో) కోతలు తప్పడం లేదు. రెండుమూడు రోజులకు ముందై తే.. ఆరేడు గంటల పాటు కోతలు నడిచాయి.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ కోతలను విధిస్తున్నారు. ప్రజలకు 24 గంటలు విద్యుత్తును అందిస్తామని చెప్పిన ప్రభుత్వం విద్యుత్తు కొరత నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తున్నది.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 20,267 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఈ నెల 2న సగటున 5,679 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ఆరోజు గరిష్ఠ డిమాండ్ 10,724 మెగావాట్లు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి సంస్థలు, యూనిట్లు, సోలార్, విండ్, హైడల్ విద్యుత్తు ఉత్పత్తికితోడుగా సెంట్రల్ పూల్ నుంచి వచ్చే విద్యుత్తు జతకలవడంతో.. 175-180 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం మరో 29.38 మిలియన్ యూనిట్ల వరకు ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసింది. దీనితో మొత్తం 208.125 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. నిజానికి ఇది 230 నుంచి 240 మిలియన్ యూనిట్ల వరకు ఉండాలి. గృహాలకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు కోతలు విధించడం ద్వారా సుమారు 30 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్తును ఆదా చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాల్సి వస్తున్నది.
తెలంగాణలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 17,228 మెగావాట్లు.. ఈ నెల 2న తెలంగాణలో వ్యవసాయంతోపాటు.. అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరిగింది. గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ రోజు గరిష్ఠ డిమాండ్ 10,080 మెగావాట్లు కాగా.. ఎటువంటి కోతలు విధించకుండానే 215.26 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మనం వినియోగించుకున్నాం.
ప్రగతి రథచక్రానికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని చక్కదిద్దే పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచే మొదలు పెట్టారు. ముందుచూపు.. పక్కా ప్రణాళికతో ఆర్నెల్లలోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందించేలా వ్యవస్థల రూపకల్పనకు కేసీఆర్ మార్గదర్శనంచేశారు. మన అవసరాలు.. అందుకు కావాల్సిన వసతులు, సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ.35.96 వేల కోట్లు ఖర్చు చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్లు, బీటీపీఎస్ 1080 మెగావాట్లు ప్లాంట్లను ప్రారంభమయ్యాయి. 4 వేల మెగావాట్ల యాదాద్రిని శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇలా ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఉమ్మడి ఏపీతో సహా.. పలు రాష్ర్టాల్లో ఎప్పుడూ రానంత గరిష్ఠ డిమాండ్ 14,160 మెగావాట్లు (29.3.2022) వచ్చినా క్షణంపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడగలిగారు. మరోవైపు సింగరేణి మన రాష్ట్రంలో ఉండటం మనకు కలిసివచ్చిన అంశం. సరిపోయినంత బొగ్గును అందిస్తూనే.. సొంతంగా థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయడం ద్వారా రాష్ట్ర అవసరాలకు అండగా ఉంటున్నది. దీంతో దేశంలోనే అత్యధికంగా తలసరి విద్యుత్తు వినియోగం 2,012 యూనిట్లు మన దగ్గరే ఉన్నది. జాతీయ సగటు తలసరి విద్యుత్తు వినియోగం 1,161 యూనిట్ల కంటే.. మన రాష్ట్రంలో సుమారు 850 యూనిట్లు అధికంగా తలసరి వినియోగం ఉండటం గమనార్హం. సగటు తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ): దేశంలోని అనేక రాష్ర్టాలు.. అందునా అనేక మెట్రో నగరాలు కరెంటు కోతలతో వణుకుతున్నాయి. ముంబైలాంటి ఆర్థిక రాజధానిలో సైతం గంటలకొద్దీ అంధకారం అలముకొంటున్నది. హైదరాబాద్లో మాత్రం రెప్పపాటు కాలం కూడా కోతల్లేకుండా కరెంటు సరఫరా అవుతున్నది. సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉన్నా, కోతల ఊసే లేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో 40-42 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంటు డిమాండ్ కూడా పెరిగింది. గత నెల 27న గరిష్ఠంగా 71.49 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. సోమవారం కూడా 3,200 మెగావాట్ల డిమాండు ఉండగా… వినియోగం 71 మిలియన్ యూనిట్ల వరకు ఉన్నది. ఈ డిమాండ్ మే నెలలో రోజుకు 3,800 మెగావాట్ల వరకు ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలోనూ నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇస్తున్నారు.
ఎన్టీపీసీ సింహాద్రిలోని నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దాదాపు రెండువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో మంగళవారం ఉదయం మూడు గంటల నుంచి ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. నాలుగు యూనిట్లలో ఒకేసారి కరెంటు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే మొదటిసారి. గ్రిడ్ నుంచి కూడా విద్యుత్తు సరఫరా కాలేదు. అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతంలో వర్షం కురవడంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆధారమైన కలపాల 400 కేవీ విద్యుత్తు స్టేషన్కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోయింది. దాదాపు రెండున్నర గంటల తరువాత అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్తును పునరుద్ధరించి పాక్షికంగా సరఫరాచేశారు. భారీ ఈదురుగాలులు, వర్షంతో గాజువాక, కాలపాక సబ్స్టేషన్లు ట్రిప్ అయినట్టు యాజమాన్యం వివరణ ఇచ్చింది. నాలుగు యూనిట్లలో ట్రిప్ కావడం వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్టు వివరించింది.
మాకు చేతినిండా పని ఉన్నది. రోజుకు 24 గంటలపాటు పనిచేసేవాళ్లం. ఇప్పుడు విద్యుత్తు కోతతో సరిగ్గా పనిచేయలేకపోతున్నాం. మా సంస్థలో 70 మంది ఉద్యోగులు/ కార్మికులున్నారు. ఒక్క షిప్టును మాత్రమే రన్ చేయగలుగుతున్నాం. వైజాగ్లో విద్యుత్తు కోతలు ఉండడంతో మా కస్టమర్లకు ఒప్పుకొన్న పనిని చేసివ్వడానికి హైదరాబాద్లోని బాలానగర్లో మరో సంస్థతో ఒప్పందం చేసుకొని వారికి పనులు ఇస్తున్నాం. ఇంకో నెల రోజులు ఇదేవిధంగా విద్యుత్తు కొరతలుంటాయని చెప్తున్నారు. మా వ్యాపారాన్ని ఏపీలో కోతలతో చేయలేము. ఆర్డర్లను సమయానికి అందించాలంటే హైదరాబాద్కో మరోచోటికో వెళ్లక తప్పేలా లేదు.
– నవీన్, హైడ్రాలిక్స్ కంపెనీ
గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4-6 గంటలకు తగ్గకుండా కోతలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కూడా ఉంటున్నాయి. విద్యార్థులకు పరీక్షల సమయం. అప్రకటిత విద్యుత్తు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రైతులకు 9 గంటల పాటు ఇస్తామని తొలుత చెప్పింది. 7 గంటలు నిరంతరాయంగా ఇస్తామని అధికారంలోకి వచ్చాక చెప్పారు. ఇప్పుడు దఫదఫాలుగా 4-5 గంటలను మించి ఉండటం లేదు. కోతలతో పల్లెల్లో తాగునీళ్లకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 15 రోజుల నుంచి సమస్య మరింత జటిలమైంది.
– బలరాం, సీపీఎం నేత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
విద్యుత్తు కోతలతో ఆక్వా రైతులకు తీరని నష్టం కలుగుతున్నది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఎయిరేటర్లు తిరగాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే చెరువుల్లోని రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేందుకు ఎయిరేటర్ల అవసరం ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులు జనరేటర్లను మెయింటెన్ చేయలేరు. చేపలు, రొయ్యలు వంటివాటిని నిల్వచేసే కోల్డ్ స్టోరేజ్లు, ఐస్ ఫ్యాక్టరీలు దెబ్బతింటున్నాయి. గోదావరి, నెల్లూ రు జిల్లాల్లో చేపలు, రొయ్యల నిల్వ, రవాణాకు కోల్డ్ స్టోరేజీలు, ఐస్ చాలా ముఖ్యం. ఐస్ ధర అమాంతం పెరిగింది. ఇది మత్స్య పరిశ్రమతో ఉన్న రైతులకు ఇబ్బంది.
-లంకా కృష్ణమూర్తి, రైతు నాయకులు, భీమవరం
విద్యుత్తు కోతలతో నరకం చూస్తున్నాం. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. బిల్లులు బాగానే వసూలు చేస్తున్నారు. సేవలే నాసిరకంగా ఉంటున్నాయి. ఇంట్లో ఉండలేరు.. బయట నిలబడలేరు అన్నట్టుగా మారింది. పల్లెల్లో ఎక్కువ కరెంటు కోతలున్నాయి. పక్కన ఉన్న తెలంగాణలో మంచిగా విద్యుత్తు సరఫరా ఉన్నది. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలాఖరు పరిస్థితిని తలుచుకుంటే భయమేస్తున్నది.
– ఉండవల్లి రమేశ్ నాయుడు, న్యాయవాది, భీమవరం