హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్ పథకం దేశ భవిష్యత్తుకే ప్రమాదమని తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి.దాణ కర్ణాచారి తెలిపారు. బీజేపీ విధానాలు దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రగులుతున్న ఆగ్రహ జ్వాలలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కిందట ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టి, ఇప్పుడు వాళ్లు కూడా అగ్నిపథ్ కిందే పనిచేయాలని చెప్పడం దారుణమన్నారు. అగ్నిపథ్తో ఆర్మీ బలహీనపడే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. గతంలో వ్యవసాయ చట్టాలతో రైతుల జీవితాలను ఛిద్రం చేయాలని చూశారని, ప్రస్తుతం అగ్నిపథ్తో యువత భవిష్యత్తును బలి చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా మోదీ చేశారా అని ప్రశ్నించారు. కేంద్రం అగ్నిపథ్ను ఉపసంహరించుకోకపోతే ఉద్యోగ సంఘాల నేతృత్వంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.