Minister Prasant Reddy on Modi | సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, లేకపోతే దిగిపోవాలని ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అంటే బీజేపీకి,మోదీకి ఎంత భయమో ఇవాళ అర్థమైందని అన్నారు. `అవే జూటా మాటలు – ఆక్రోశపు ప్రసంగాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం చేసింది` అని ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సాధకుడు, గౌరవ సీఎం కేసీఆర్ సంధించిన ఒక్క ప్రశ్నకూ ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు మోదీ వద్ద జవాబు లేదన్నారు.
తెలంగాణ అంటేనే అణువణువునా విషం నింపుకున్న కేంద్ర బీజేపీ నేతల మోసపు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క బక్క పలుచని కేసీఆర్ను ఎదుర్కోవడానికి సమావేశాల పేరిట ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణ మీద పడ్డారని ఆరోపించారు. బీజేపీ నేతల్లో ఢిల్లీ పీఠం కదులుతున్నదనే భయం మొదలైందన్నారు.
`మీ మేకపోతు గాంభీర్యపు మాటలకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పాలిట శత్రువులే. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు. దేశాన్ని నీ కార్పొరేట్ మిత్రులకు ధారాదత్తం చేయడాన్ని యావత్ దేశం పక్షాన కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకు సమాధానం చెప్పలేదు..?. కేసిఆర్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతే గద్దె దిగిపో` అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ గడ్డ మీదకొచ్చి అరిచి గీ పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ మాటలు హర్షించరు. యువ నేత కేటీఆర్ కృషి వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు` అని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. `మీ వాట్సాప్ యూనివర్సిటీ, మీ అసత్యపు సోషల్ మీడియా ప్రచారాలను కేటీఆర్ చెక్ పెడుతున్నారు. మా వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుదామనే మీ కుట్ర తెలంగాణ రైతన్నలకు ఇంకా గుర్తున్నది మోదీజీ ` అని చెప్పారు.
`తెలంగాణకు రావాల్సిన నిధులు, సంస్థలు కుట్ర పూరితంగా నిలిపేస్తూ గుజరాత్కు తరలించుకుపోవడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్లు అన్ని ట్రబుల్ ఇంజన్లే. తెలంగాణ తరహా పథకాలు కావాలని మీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు అడుగుతున్నారు మోదీ జీ ?. కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఎదిగింది. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలని, కేసీఆర్ గారి నాయకత్వం కావాలని యావత్ భారతదేశం కోరుకుంటున్నది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు,దేశానికి శ్రీరామరక్ష` అని ప్రశాంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.