TS Minister Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూసి జాలి పడి కరిగిపోవద్దని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ప్రజలను కోరారు. తెలంగాణ రాకముందు 400 మీటర్ల లోతు బోరు బావి తవ్వినా నీర్లు పడక పోయేవని, కానీ ఇప్పుడు చెరువులు బాగు చేసుకున్న తర్వాత బావులు, బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. శనివారం ఆయన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఖాళీ కుర్చీలు పెట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటేనన్నారు. కానీ బీఆర్ఎస్ మీటింగులలో ప్రజలకు చోటు దొరకని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. కాంగ్రెస్ని చూసి జాలి పడి కరిగిపోయి ఓటేయవద్దని, రిస్క్ చేయకుండా కారు గుర్తుపై ఓటు గుద్దాలని ప్రజలను కోరారు.
కాలజ్ఞానంలో భవిష్యత్ గురించి రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మొగోళ్లు నాట్లేస్తరని ఊహించలేదని, కానీ ప్రస్తుతం తెలంగాణలో చత్తీస్ గఢ్ నుంచి మగోళ్లు వచ్చి వరి నాట్లేస్తున్నారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మన సీఎం కేసీఆర్ కాలాన్ని ఎలా తిరగ రాసిండో గమనించాలన్నారు.
`బీఆర్ఎస్ గెలిస్తే బీడీ కార్మికుల పింఛను ఇప్పుడున్న రూ.2000 నుంచి రూ.5,000 పెరుగుతది. కారుకు ఓటేస్తే జనవరి నుంచి సోనామసూరి బియ్యం ఇస్తం. పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.
వంద అబద్ధాలాడి అయినా సరే పెండ్లి చేయాలన్నట్టు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఆరాటం కాంగ్రెస్ది. పల్లె పల్లెనా ప్రగతి పరుగు పెట్టాలంటే పల్లన్ననే గెలవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్కి ఇంటి మనిషి లెక్క. పల్లన్నగెలిస్తే మరో గజ్వేల్, సిద్ధిపేటగా జనగామను మారుస్తడు` అని హరీశ్ రావు చెప్పారు.
`సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే చిన్నపిల్ల లాంటి తెలంగాణ సురక్షితంగా ఉంటుంది. కాంగ్రెస్ చేతిలో పడితే కుక్కలు చింపిన విస్తరి అవుతది. కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎన్నికల తర్వాత ఏ పార్టీలో ఉంటడో తెల్వదు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిండు. మంచి పనిమంతుడు. ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేగా వచ్చే జీతం కూడా పేద ప్రజలకే ఖర్చు పెడతానని అంటున్నడు. ఇంత మంచి మనస్సు ఉన్న వ్యక్తిని గెలిపించాలి` అని హరీశ్ రావు అన్నారు.