హైదరాబాద్: ప్రముఖ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్స్టార్ కృష్ణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రద్ధాంజలి ఘటించారు.కృష్ణ పార్థివదేహంపై పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులు మహేష్ బాబు, గల్లా జయదేవ్, సుధీర్ బాబు తదితరులను మంత్రి పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ.. నటుడు కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. 350కి పైగా సినిమాలలో నటించిన అగ్రశ్రేణి నటుడు కృష్ణ అని గుర్తుచేశారు.
తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో ఆయన నూతన ఒరవడిని సృష్టించారని చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు సేవలు అందించిన కృష్ణ.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంబడి మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ తదతరులు ఉన్నారు.