హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రశంస దక్కింది. పచ్చదనం పెంపుదలలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఇది శుభవార్త అని అన్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) గ్రీన్ విజన్, ప్రభుత్వ కృషి పట్టుదలకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదిక ఒక సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ (జూన్ 5) సందర్భంగా తెలంగాణకు దక్కిన బహుమతి అని మంత్రి అన్నారు. మిగతా రాష్ట్రాలను అన్నింటినీ వెనక్కు నెట్టి పది పాయింట్లలో తెలంగాణ 7.21 పాయింట్లు సాధించటం శుభ పరిణామమని వెల్లడించారు.
తెలంగాణకు హరితహారం(Harita Haram) ద్వారా తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తూనే మరోవైపు అటవీ పునరుద్ధరణ చేపట్టిందని తెలిపారు. ఫారెస్ట్ కవర్ గణనీయంగా పెంచటంపై గతంలోనే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI), స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇదే
ఉత్సాహంతో అన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.