హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిలో దేశంలో కరెంటు కోతకు సంబంధించిన తీర్మానంలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. నీళ్ల వ్యథ ఎట్లుందో కరంటు కథ అట్లే ఉంది. కోల్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఈ బొగ్గుతో 125 ఏండ్లు ఏ కొరత లేకుండా కరెంటు ఇవ్వవచ్చు. దేశంలో ఇంకా కనుగొనని బొగ్గు నిక్షేపాలు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కూడా కరెంటు వెలికితీస్తే శతాబ్దాల పాటు కరెంటును ఉత్పత్తి చేయవచ్చునని ఖనిజ శాస్త్ర నిపుణుల పరిశోధనల ద్వారా తేలుతున్నది.
మన దేశానికి 4 లక్షలకు పైగా మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది. దేశంలో ఉన్న జల వనరులను సంపూర్ణంగా వినియోగించుకుంటే మరో లక్ష మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. భారతదేశంలో అనంతమైన సౌరశక్తి అందుబాటులో ఉంది. ఇన్ని ఉండి కూడా కరెంటు కోతలతో దేశం చీకటి వెతలను అనుభవిస్తున్నది. కరెంటు కొరత ప్రభావం వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు తదితర అనేక రంగాలపై పడి దేశ ఆర్థికస్థితి బలహీన పడుతున్నది. తలసరి విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధి స్థాయిని తెలియజేసే ప్రబలమైన సూచిక. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఐస్ లాండ్ అనే చిన్న దేశం అగ్రస్థానంలో ఉంది.
ఈ దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 52,980 యూనిట్లు. నార్వేలో 27,529 యూనిట్లు. ఖతార్లో 17,670, స్వీడన్ లో 16,538, కెనడాలో 16,405, అమెరికాలో 12,314, దక్షిణ కొరియా 11,355, సౌదీ అరేబియా 9,920, ఆస్ట్రేలియాలో 9,531, ఫ్రాన్స్ 8,545, చైనా 5,950, బ్రెజిల్ 3,091 యూనిట్లు కాగా మన ఇండియాలో తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,218 మాత్రమే. 140 దేశాలను సర్వే చేస్తే మన ఇండియా స్థానం 104. ఇది విశ్వ గురువులుగా బడాయిలు పోతున్న మన పాలకులు సాధించిన మహత్తర ఫలితం. మన దేశంలో అందుబాటులో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గును హైబ్రిడ్ పద్ధతిలో వాడినట్లయితే దేశ ప్రజలందరికీ అన్ని రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైనే విద్యుత్తును 150 సంవత్సరాలపాటు అందించవచ్చు.
వ్యవసాయ రంగంలో నెలకొన్న కరెంటు సంక్షోభాన్ని సునాయసంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకు మన తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ తరహాలో దేశంలో విద్యుత్తు సరఫరా చేయాల్సిన అవసరం ఉండగా అందుకు భిన్నంగా దేశ ప్రజల నెత్తురు, చెమటతో నిర్మాణమైన లక్షల కోట్ల విలువైన విద్యుదుత్పత్తి, విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను, అవి నిర్మాణం చేసుకున్న మౌలిక వసతులను అడ్డికి పావుసేరు చొప్పున ప్రైవేటు భూతాలకు అప్పజెప్పేందుకు దేశ పాలకులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేగాకుండా దేశీయమైన బొగ్గు నిల్వలుండగా అవినీతికి పాల్పడుతూ అనవసరంగా విదేశీ బొగ్గును రాష్ట్రాలతో అధిక ధరకు కొనిపిస్తున్నారు. ఇటు బొగ్గు గనుల్ని, అటు విద్యుత్తు రంగాన్ని రెండింటినీ ప్రైవేటుకు అప్పజెప్పి ప్రజల మీద మోయలేని బిల్లుల భారాన్ని మోపేందుకు నిర్లజ్జగా పన్నాగాలు రచిస్తున్నారు.
ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీయే దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాలని ఈ ప్లీనరీ తీర్మానిస్తున్నది. తెలంగాణలో కరెంటు సమస్యను పరిష్కరించిన అనుభవంతో దేశంలోనూ వ్యవసాయానికి ఉచితంగా, అన్నిరంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే విధంగా నూతన విద్యుత్తు విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని నేటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.