హైదరాబాద్: సినిమా దర్శకుడు శంకర్కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఆ భూ కేటాయింపులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శంకర్కు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కొట్టివేసింది. కాగా, పిటిషన్పై బుధవారమే విచారణ జరిపిన న్యాయస్థానం శంకర్కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, ఒక్కో అవసరానికి ఒక్కో విధానం ఉటుందని అభిప్రాయపడింది.
ప్రభుత్వం సినీ కళాకారులకు, క్రీడాకారులకు భూములను కేటాయిస్తుందని, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, హజారికాకు ఆయా ప్రభుత్వాలు భూములు కేటాయించాయని గుర్తుచేసింది. కాగా, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలా గ్రామంలోని సర్వే నం.8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను దర్శకుడు శంకర్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన జే శంకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు పూర్తి కావడంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ మేరకు హైకోర్టు ఇవాళ భూ కేటాంయిపును సమర్థిస్తూ ఆ కేటాయింపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.