హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో చట్ట ప్రకారం హకులు లేని భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, గోవింద్రెడ్డి తదితరులు 26 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సదరు భూమికి చెందిన హకుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నందతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు.. అప్పటి తాసిల్దార్ సంతకాలకు పొంతన లేదన్నారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్టుగా పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారని, హకులు లేని వ్యక్తుల నుంచి కొనుగోళ్లు చేయడం చెల్లదని చెప్పారు. ఆర్మీలో జవాన్లుగా పనిచేసినవారికి ఐదు ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధన అని, కమాండర్ ఇన్ చీఫ్గా చేసిన నరసింహనాయక్కు ఆ పథకం వర్తించదని చెప్పారు.
మాజీ సైనికులకు భూమి ఇవ్వాలని 1963లో అమలు చేస్తే అంతకు రెండేండ్ల ముందే నర్సింహనాయక్కు భూమి కేటాయించినట్టుగా బోగస్ పత్రాలు సృష్టించారని చెప్పారు. తాసిల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించిందని పేర్కొన్నారు. సంతకాల మధ్య పొంతన లేదని అన్నారు. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నదని వివరించారు. అయితే 15 ఏండ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ జడ్జి బెంచి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరారు. రామానాయుడు, రాఘవేంద్రరావు తదితరుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.