దరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాసంస్థలు, అన్ని ప్రభుత్వ సంస్థలు దుస్తులు బెడ్షీట్లు, కార్పెట్లు, టవల్స్, దుప్పట్లను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే సేకరించాలని హైకోర్టు తెలిపింది. ఈ నెల 2న ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) ఇచ్చిన ఈ-టెండర్ నోటిఫికేషన్ చెల్లదని తీర్పు వెలువరించింది. గురుకుల పాఠశాలలకు దుస్తుల సరఫరా నిమిత్తం ఈ నెల 2న జారీచేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ వరంగల్ జిల్లా కొత్వాడకు చెందిన వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు.
చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 17,069 హ్యాండ్లూమ్లు ఉండగా.. ఈ పరిశ్రమపై సుమారు 40వేల కుటుంబాలు ఆధారపడినట్టు పేర్కొన్నారు. చేనేత పరిశ్రమను నిలబెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2024లో జీవో 1 తీసుకువచ్చిందని తెలిపారు. జీవోలోని అంశాలకు ఏ వ్యాఖ్యానం చేసినా అది జీవో ఆశయాన్ని దెబ్బతీయడమే అని స్పష్టంచేశారు.నేత కార్మికుల అభ్యున్నతికి తీసుకొచ్చిన జీవోలోని అంశాలను అధికారులు విస్మరించేందుకు వీలు లేదని తెలిపారు.
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు, ప్రభుత్వ దవాఖానలన్నీ తమ చేనేత అవసరాలను టెస్కో, ఇతర అర్హత కలిగిన సొసైటీల నుంచే సేకరించాలని ప్రభుత్వం 2024 మార్చి 11న జీవో-1 జారీ చేసిందని గుర్తుచేశారు. టీఎస్సీవో సరఫరా చేయలేమని ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే ఇతర ఏజెన్సీల నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సేకరించవచ్చని చెప్పారు. ప్రభుత్వ సంస్థలకు అవసరమైన చేనేత వస్ర్తాల సేకరణ నిమిత్తం ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 17ను జారీ చేసిందని తెలిపారు.
సామాజిక, ఆర్థిక అభివృద్ధి నిమిత్తం జారీచేసిన జీవో 1ని జీవో 17 అతిక్రమించలేదని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని చూడాలని పేర్కొన్నారు. ఈ కారణంతో సరఫరా చేయలేమన్న టెస్కో లేఖ లేకుండా ఇచ్చిన ఈ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. టెస్కో పరిధిలోని ఇతర వస్తువుల సేకరణకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ తీర్పులో స్పష్టం చేశారు.