హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ట్రిబ్)ను హైకోర్టు ఆదేశించింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్లో జారీ చేసిన ట్రిబ్ నోటిఫికేషన్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నది.
ఆగస్టు 1న నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం పేపర్ మాత్రమే ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్కు విరుద్ధంగా పరీక్ష నిర్వహించడం నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని చెప్పారు. పరీక్షకు తెలుగు మీడియం అభ్యర్థులు వేలల్లో హాజరయ్యారని, వారికోసం తెలుగులోనూ పరీక్ష నిర్వహించాలని కోరారు. ట్రిబ్ పరిధిలో ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుగుతున్నదని, అందుకే ఇంగ్లిష్ పేపర్ సరిపోతుందని స్టాండింగ్ కౌన్సిల్ రమేశ్ ప్రస్తావించారు. వాదనలు విన్న అనంతరం తిరిగి పరీక్ష నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని ఆదేశించింది.