హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత యువరాష్ట్రమైనా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ, పర్యాటకంలోనూ పరుగులు పెడుతున్నది. ఈ మాట అన్నది సాక్షాత్తూ నీతి ఆయోగ్.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి విధానంపై అభినందనలతో ముంచెత్తిన ఆ జాతీయ సంస్థ, తన ‘అర్థ్ నీతి’ నివేదికలో పర్యాటక రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అతితక్కువ సమయంలోనే తెలంగాణ పర్యాటకులను భారీగా ఆకర్షించే రాష్ట్రంగా ఎదిగిందని ప్రశంసించింది. హైదరాబాద్ నగరం జాతీయ అంతర్జాతీయ సమావేశాలు, సమ్మేళనాలు, కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్లకు ప్రముఖ స్థానంగా మారిందని పేర్కొంది. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ 2017, వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫెక్షన్స్ డిజీసెస్- 2016 వంటి సమావేశాలెన్నో హైదరాబాద్లో జరిగాయని, అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ టూరిజానికి దేశంలోనే హైదరాబాద్ కీలక స్థానంగా ఎదిగిందని వెల్లడించింది.
ప్రత్యేక ఆకర్షణగా చారిత్రక కట్టడాలు
తెలంగాణలోని మతపరమైన ప్రాంతాలు శ్రీశైలం, భద్రాచలం, యాదాద్రి, హన్మకొండ, చారిత్రక ప్రాంతాలైన గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, రామప్ప ఎకో టూరిజం దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. 2018లో తెలంగాణను 9.28 కోట్ల మంది భారతీయులు, 32 లక్షల మంది విదేశీయులు సందర్శించారని వెల్లడించింది. రాష్ర్టానికి వచ్చే మొత్తం పర్యాటకుల్లో హైదరాబాద్ను సందర్శించే వారే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. స్వదేశీ పర్యటకుల్లో 25-30 శాతం మంది, విదేశీయుల్లో 90-95 శాతం మంది హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన వారే ఉండటం గమనార్హం.