హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల ప్రక్రియలో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. దంపతుల కేసులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, కాలయాపన చేయొద్దని సూచించారు. శుక్రవారం ఆయన బీఆర్కేభవన్లో వివిధ శాఖల అధిపతులతో విడివిగా సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో కేటాయింపుల తీరును అడిగి తెలుసుకొన్నారు. ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు, పోస్టింగ్ల తరువాత వచ్చిన అప్పీళ్లను కూడా పరిష్కరించాలని, ఒక్కొక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దూర ప్రాంతాలకు కేటాయించిన వారిని సాధ్యమైనంత మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్ వచ్చే విధంగా చూడాలని సీఎస్ సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల కేటాయింపులు, బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఉద్యోగులకు సానుకూలంగా వ్యవహరించాలని సీఎస్కు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.