తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 19: మన సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకొంటూ భావితరాలకు వాటిని అందించేందుకు మరింత కృషి జరగాల్సి ఉన్నదని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ధర్మ పరిరక్షణ, ప్రచార వ్యాప్తికి తెలంగాణలో వేద పాఠశాలలు నెలకొల్పడం శుభ పరిణామమని ప్రశంసించారు. హైదరాబాద్కు వచ్చిన ఆయనను మహాస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో లలిత కళాతోరణంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచికి, తెలుగు రాష్ట్రాలకు మంచి అనుబంధం ఉన్నదని తెలిపారు. ఏ దేశంలో ఉన్నా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని అనుసరిస్తూ జీవించాలని సూచించారు.
తెలుగు రాష్ర్టాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాయని, ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తదితర మందులను విదేశాలకు ఎగుమతిచేసే స్థితికి చేరుకొన్నాయని ప్రశంసించారు. స్కందగిరి ఆలయంలో మూలవిరాట్కు స్వర్ణబంధం జరగబోతున్నదని, రెండు రోజులపాటు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారని వెల్లడించారు. శాంతాబయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను రక్షించుకొంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రభుత్వం తరపున హాజరై శంకర విజయేంద్ర సరస్వతిని సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవీఆర్ కృష్ణారావు, దోర్బల ప్రభాకరశర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.