హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ) : మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నదని కేంద్రం ప్రశంసించింది. నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్షాప్ సందర్భంగా తెలంగాణకు రెండు అవార్డులను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మాతాశిశు మరణాలను నివారించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతుల మీదుగా తెలంగాణ మెటర్నల్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ పద్మజ అవార్డును అందుకున్నారు. దేశంలోనే తొలిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంపై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. హైరిస్క్ కేసులను గుర్తించి, చికిత్స అందించంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని ప్రశంసించింది.
రాష్టంలో ప్రసూతి సేవలను మెరుగుపర్చడం ద్వారా మాతాశిశు మరణాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణను అందించింది. ఇప్పటివరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను 49 దవాఖానల్లో ప్రభుత్వం నియమించింది. మరో 141 మంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే వీరందరూ విధుల్లోకి దిగనున్నారు.
హైరిస్ ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి చికిత్స అందించడంలోనూ రాష్ట్రం ముందువరుసలో ఉన్నది. ఈ తరహా సేవల్లో దేశంలో తమిళనాడు తర్వాత రెండోస్థానం తెలంగాణదే.
వైద్యరంగంలో తెలంగాణకు మరోసారి అవార్డులు దక్కడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతాశిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. రాష్ర్టానికి మరో రెండు కేంద్ర పురస్కారాలు రావడం వైద్యసిబ్బంది పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.