హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా సంక్షోభం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు, సవాళ్లు తలెత్తినప్పటికీ.. వివిధ రంగాల్లో భారత్లాంటి దేశాలకు అనేక నూతన అవకాశాలను కల్పించిందన్నారు. ఆదర్శ విధానాలతో ప్రపంచంలోని అనేక కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలాంటి రాష్ట్రాలకు ఇది మంచి అవకాశమని చెప్పారు. గత ఏడు సంవత్సరాల్లో పారిశ్రామిక విధానాలు, సంసరణలతో తెలంగాణ తనదైన గుర్తింపును సాధించిందని, అనేక పెట్టుబడులు తీసుకురాగలిగామని స్పష్టంచేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వివిధ దేశాల కంపెనీలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని, ఆయా దేశాల్లోని పారిశ్రామిక వర్గాలను ఆహ్వానించి ఇకడి పరిస్థితులను వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్తోపాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.