వరంగల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు వేదికగా నిలిచే టెక్నికల్ ఫెస్ట్ టెక్నోజియాన్-24 (ఇన్ జీనియస్) వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ వీటీ సోమశేఖర్ టెక్నోజియాన్ను ప్రారంభించి మాట్లాడారు. టెక్నోజియాన్ ఆదివారం సాయంత్రం వరకు జరుగుతుందని, మొదటిరోజు ఎనిమిది ఈవెంట్లను నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, స్కూలు విద్యార్థులు రూపొందించిన టైం డిటెక్షన్ అలారమ్, రోబోటిక్ బాస్కెట్బాల్ గేమ్, మెటల్ గ్రాబింగ్ డివైజ్, ఆటోమెటిక్ డ్రైనేజీ క్లీనింగ్ సిస్టమ్, స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ట్రేడింగ్ పిట్, ఆర్బిస్, క్రాక్ ది క్వెరీ, ఇన్నోచెమ్, క్రియేటివ్ రోబోటిక్స్ ఈవెంట్లను నిర్వహించారు. శనివారం 40 టెక్నికల్ ఈవెంట్లను ప్రదర్శించనున్నారని చెప్పారు.