హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): వరల్డ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (డబ్ల్యూటీఐటీసీ) సహకారంతో ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానాలో టీ కన్సల్టెంట్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలో పనిచేసే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ ఎడ్విన్ డికోలోటీ తన స్వదేశం బోట్స్వానలో టీ కన్సల్టెంట్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తాలతో సమావేశమైన బోట్స్వానా మంత్రి, ఇతర అధికారులు తెలుగు రాష్ర్టాల్లోని ఐటీ పరిశ్రమతో అనుసంధానం అయ్యేందుకు ఆసక్తి చూపించారు.
అనంతరం సందీప్ మక్తాల మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో అనేక సేవలలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా టీకన్సల్టెంట్ తన సేవలను అందించనుందని అన్నారు. టీ కన్సల్ట్ ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించనున్నదని, దానివల్ల సేవలు సమగ్రంగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి, టెక్నాలజీ అధారంగా ఉత్తమ జీవనం సాగించేందుకు దోహదపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవీ శ్రీనివాస్, వెంకట్ తోటకూర, చల్లనగారి నరేంద్ర, తిరునహరి వంశీకృష్ణ, డాక్టర్ నిరుపమ, డాక్టర్ ప్రవీణ్ గెగ్గిలి, రవితేజ, కిశోర్ పుల్లూరి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.