హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే అనువైన సమయమని, విద్యార్థులు పాఠశాలకు వచ్చే వాతావరణం నెలకొనేలా, అలవాటుపడేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం గన్ఫౌండ్రీలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నామని, అన్నిచోట్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటున్నారని, ఇదే స్ఫూర్తిని స్కూళ్లు ప్రారంభమైన తర్వాత కొనసాగించాలని కోరారు. మంత్రులు మొదలుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల వరకు అందరూ వసతులు కల్పించడంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వారంతా ప్రత్యేక చొరవ తీసుకుంటుండడం శుభసూచకమని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులను టీచర్లు నిశితంగా గమనించాలని, వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, సెప్టెంబర్ 1లోగా అన్ని ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. శానిటైజేషన్ పనులపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్జలీల్, హైదరాబాద్ డీఈవో రోహిణి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇంటర్లో ప్రత్యక్ష తరగతులకు ఏర్పాట్లు
జూనియర్ కాలేజీల్లో 1 నుంచి ప్రత్యక్ష తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, గురుకుల కాలేజీల్లో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మార్గదర్శకాలను అనుసరించి ఏర్పాట్లు చేసుకోవాలని శనివారం ఆదేశాలు జారీచేశారు. తరగతి గదుల్లోని ఫర్నిచర్ను, కళాశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించారు.