హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలోని శిక్షణ, ఉత్పత్తి కేంద్రాల(టీసీపీసీ)ను ఆధునికీకరించడానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నది. దివ్యాంగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు గతంలో హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ దవాఖాన, వరంగల్ ఎంజీఎం, మహబూబ్నగర్, నల్లగొండ ప్రభుత్వ దవాఖాన, రంగారెడ్డి జిల్లాల్లో టీసీపీసీలను ఏర్పాటుచేశారు. దివ్యాంగులకు కావాల్సిన వీల్చైర్లు, ట్రై సైకిళ్లు, చేతికర్రలు ఇక్కడ ఉత్పత్తి చేసేవారు. ఆగర్బత్తిలు, కొవ్వుత్తుల తయారీ వంటి అంశాల్లో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చేవారు.
సెంటర్ల నిర్వహణపై ఉమ్మడి రాష్ట్రంలో తగినంత శ్రద్ధ పెట్టకపోవడంతో చాలావరకు మూతపడ్డాయి. మలక్పేట దివ్యాంగుల సంక్షేమభవన్ ప్రాంగణం, రంగారెడ్డి జిల్లాలోని సెంటర్లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఆయా సెంటర్లలో ప్రస్తుతం నెలకు సగటున 100-150 ట్రైసైకిళ్లు, చేతికర్రలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సెంటర్లను ఆధునికీకరించడంతో పాటు మూతపడ్డవాటిని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. టీసీపీసీల ద్వారా మార్కెట్లో ప్రస్తుత డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అవసరమైన ఆధునిక చెత్త సేకరణ బండ్లను తయారుచేయాలని యోచిస్తున్నది.
వికలాంగుల ఆర్థిక సంస్థ ఇప్పటికే నమూనా బండ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల తయారీపై దృష్టి సారిస్తున్నది. త్వరలోనే బ్యాటరీ కంపెనీల ప్రతినిధులతో వికలాంగుల ఆర్థిక సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపనున్నట్టు సమాచారం. దివ్యాంగుల స్వయం ఉపాధికి దోహదపడే విధంగా కంప్యూటర్ ఆధారిత అంశాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
టీసీపీసీలపై సీఎం ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకొంటున్నారు. టీసీపీసీల ఆధునికీకరణకు కమిటీని నియమించారు. నేటి అవసరాలకు అనుగుణంగా ఇతర ఉత్పత్తులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నాం.
– కే వాసుదేవరెడ్డి, తెలంగాణ వికలాంగుల ఆర్థిక సంస్థ చైర్మన్