హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ బండారాన్ని బయటపెట్టినందుకు కక్షసాధింపుగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. ఈడీ నోటీసులపై న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందన్న బండి సంజయ్ ఆరోపణలను రోహిత్రెడ్డి ఖండించారు. కర్ణాటక అధికారులు ఎవరూ తనను విచారణకు పిలవలేదని తేల్చి చెప్పారు. ‘ప్రతీ దానికి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అంటారు. నేను అదే ఆల యం నుంచి సవాల్ విసురుతున్నా. సంజయ్.. దమ్ముంటే రేపు (ఆదివారం ఉదయం 10 గం టలకు) భాగ్యలక్ష్మి ఆలయానికి రా! కర్ణాటక పోలీసులు నన్ను విచారించారని ప్రమాణం చెయ్! లేదంటే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పు’ అని సవాల్ విసిరారు.
బీజేపీ వేయి పడగల పాము
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకు తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నానని రోహిత్రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రతిష్ఠను బీజేపీ దిగజారుస్తున్నదని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను బీజేపీ తన త్రిముఖ దళాలుగా వాడుకొంటూ, భారత ప్రజాస్వామ్యాన్ని వేయి పడగల పాములా పట్టి పీడిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో బయలుదేరారని, ఆయనను తెలంగాణ వరకు పరిమితం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను చూస్తే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈడీ నోటీసులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. తనకు ఇచ్చిన నోటీసులు చూసి న్యాయవాదులే ఆశ్చర్యపోతున్నారని, నోటీసులో తన బయోడాటా అడగడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. తనకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు.