హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వీ6 న్యూస్ చానల్పై చర్యలు తీసుకోవాలని మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఎన్నికల ఏజెంట్ నంద్యాల దయాకర్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటువేసేలా వీ6 న్యూస్ చానల్ రిపోర్టర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో నిల్చొన్న ఓటర్లను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేసేలా ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని దయాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.