న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రికత్తల నేపథ్యంలో ఇంధన సరఫరా మందగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రకటించిన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసు పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి రెండు సార్లు ఇంటి నుంచి పని చేయాలని మే నెలలో సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని, దీంతో వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం కార్యాలయం పేర్కొన్నది. బుధవారం, శనివారం రోజుల్లో వర్క్ ఫ్రం హోం కోసం ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నియమాన్ని ఎత్తివేసింది. ఇక ఆఫీసు వేళలను కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పనిగంటలుగా ప్రకటించారు. గతంలో 10.30 నుంచి ఏడు గంటల వరకు ఉండేది. వర్క్ ఫ్రం హోం పాలసీ మార్పులకు చెందిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.