హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీ హబ్ దూసుకుపోతున్నది. ఇందుకు ప్రత్యేకంగా ‘ల్యాబ్ 32’ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 2018లో ప్రారంభమైన సీడ్ యాక్సిలరేటర్ ల్యాబ్ 32లో ఇప్పటి వరకు పది విడతల్లో 249 స్టార్టప్లకు ఆలోచన స్థాయి నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వరకు అవసరమైన సహాయ సహకారాలను, ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నది. వీటి ద్వారా స్టార్టప్లకు 403 మిలియన్ డాలర్లు (రూ.3,300 కోట్లు) వరకు నిధులు సమకూరగా, సుమారు 58 మంది మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అత్యాధునిక టెక్నాలజీకు ప్రాధ్యాతనిస్తూ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్లో పదో దశ కోహర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు వివరించారు. టీ హబ్ ద్వారా వివిధ రంగాలకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పరిష్కార మార్గం చూపే స్టార్టప్లను ఎంపిక చేస్తామని తెలిపారు. వీరికి మూడు నెలల పాటు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీలైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్, ఏఆర్, వీఆర్, బ్లాక్ చైయిన్లతో మెటావర్స్, వెబ్ 3.0, ఫిన్టెక్, అగ్రిటెక్, హెల్త్టెక్ రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ఎంపిక చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కింద ఎంపికైన స్టార్టప్ కంపెనీలకు టీ హబ్ వేదికగా వివిధ కంపెనీలతో మద్దతు ఉంటుందని తెలిపారు.
కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యం
కొత్త టెక్నాలజీని రూపొందిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్న స్టార్టప్లకు పాధాన్యత ఇవ్వనున్నట్లు సీఈవో ఎంఎస్ రావు వెల్లడించారు. సీడ్ యాక్సిలరేటర్ హైబ్రీడ్ కార్యక్రమంలో మూడు నెలల పాటు నిర్వహించే ల్యాబ్ 32లో స్టార్టప్లను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో సుస్థిరత, ఎడ్టెక్, డైరెక్ట్ టు కన్జూమర్, మీడియా, ఫిన్టెక్, అగ్రిటెక్, సైప్లె చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాల నుంచి సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం కలిగిన సార్టప్లు ఉండనున్నాయని చెప్పారు.